కలం, వెబ్ డెస్క్ : నీట్ (NEET) పరీక్ష వివాదం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Session) కుదిపేస్తోంది. శుక్రవారం 5వ రోజు సభ ప్రారంభం కాగానే ఉభయ సభల్లోనూ విపక్షాలు గందరగోళం సృష్టించాయి. లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ‘ఇస్తీఫా’ నినాదాలతో హోరెత్తించారు. నీట్ (NEET) పరీక్షల వివాదంపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి.
ఈ క్రమంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ, నీట్ అంశంపై సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రతిపక్షాలకు స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్షాల నినాదాలు, ఆందోళనలు కొనసాగడంతో స్పీకర్ లోక్సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే విధమైన ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

