కలం, ఖమ్మం బ్యూరో : సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు ఖమ్మం (Khammam) జిల్లా వైరా, లంకసాగర్ రిజర్వాయర్ల కింద ఉన్న వ్యవసాయ భూములకు గోదావరి జలాలను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న తల్లాడ మండల పర్యటనలో రైతులు నీటి ఎద్దడి సమస్యను తన దృష్టికి తీసుకురాగా, మంత్రి తుమ్మల వెంటనే స్పందించారు. నిన్ననే ఖమ్మం జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో పరిస్థితిపై సమీక్ష జరిపారు.
అనంతరం నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయి, నీటి అత్యవసర విజ్ఞప్తిని వివరించారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని, ప్రతీ ఎకరాకి నీరు అందేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయించడం పట్ల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

