కలం, ఖమ్మం బ్యూరో: తన కుమారునికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తూ, నక్క హర్షవర్ధన్ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వరలక్ష్మి తమ బంధువులు, సన్నిహితులతో కలిసి శ్రీ విజ్ఞాన్ స్కూల్ (Sri Vignan School) ముందు ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, మణుగూరు పట్టణంలోని శ్రీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ.. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని హర్షవర్ధన్ తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. దీంతో స్కూల్ ముందు కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అక్కడికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా శనివారం పాఠశాలకు వెళ్లిన నక్కా హర్షవర్ధన్ రేగులగండి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Also: కేసీఆర్ నోట మరోసారి ‘మనోడా.. మందోడా’ మాట
Follow Us On: Instagram

