కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సేన సమరశంఖం పూరించింది. కృష్ణ నీళ్లను వినియోగించుకునే అవకాశం లేకుండా చేసిన పాలకుల తీరుపై టీఆర్ఎస్ అధినేత్రి కవిత (Kavitha) యుద్ధం ప్రకటించారు.
గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని కవిత (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ప్రాజెక్టును విస్మరించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం చౌదరి గూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన సాధన సభ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
దసరా పండుగ లోపు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రారంభించకపోతే ప్రాజెక్టు పరిధిలో భారీ పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొంటూ పోరాట కార్యాచరణను వెల్లడించారు. పాలమూరు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు.

