కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిపై పాకిస్థాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకోగా.. సుమారు 30 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు ఆందోళనకారులను సైన్యం అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించుకుపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో పాకిస్థాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు కూడా ఉండటంతో వారి భద్రతపై స్థానికంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
ఎందుకీ నిరసనలు.. అసలు ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్పై కొంతకాలంగా సైన్యం పెత్తనం బాగా పెరిగిపోయింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల వైరుధ్యాలతో తమకు పరిపాలనా నిర్ణయాల్లో పూర్తి స్వేచ్ఛ కావాలనే డిమాండ్తో అవామీ యాక్షన్ కమిటీ (AAC) ఏర్పాటైంది. ఇదొక ప్రజా ఉద్యమ వేదిక. రాజకీయ పార్టీల కాకుండా సామాజిక సంఘాలు, వ్యాపార వర్గాలు, విద్యార్థి సంఘాల సమూహంగా ఏర్పాటైంది. విద్యుత్తు ధరలు, నిత్యావసరాల ధరలు తగ్గించడంతో పాటు స్థానిక వనరులపై పీవోకే ప్రజలకే పూర్తి హక్కులు కల్పించాలనేది ప్రధాన డిమాండ్. దీంతో తరచూ ఆందోళనల కారణంగా సైన్యానికి, ప్రజలకు ఘర్షణ ఏర్పడుతోంది. తాజాగా ఇలాగే జరిగి ఇప్పటివరకు 30 మంది మరణించారు.

