కలం, వెబ్డెస్క్: మసీదులో శక్తిమంతమైన బాంబు పేలి 50 మంది చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో (Pakistan Blast) జరిగింది. దీంతో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్లోని షెహజాద్ టౌన్ ఏరియాలో ఉన్న తర్లాయ్ ఇమామ్బర్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఒక్కసారి బాంబు పేలింది.
దీంతో ప్రార్థనకు వచ్చినవాళ్లలో పదుల సంఖ్యలో అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు, వైద్య సిబ్బంది వచ్చేసరికి ఘటనాస్థలం రక్తపు మరకలు, ఛిద్రమైన శవాలు, పొగతో నిండిపోయి ఉంది. గాయపడిన వాళ్లను హుటాహుటిన పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) అండ్ పాలీక్లినిక్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరికొందరు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 50 మంది చనిపోయారని, దాదాపు 30 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
బీఎల్ఏ ఆత్మాహుతి దాడి?
బాంబు పేలుడు (Pakistan Blast) ఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు చెబుతున్నారు. దీనికి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)నే కారణమంటున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ఆధారాలు దొరికాయని, మరింత దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు గత ఏడాది నవంబర్లోనూ ఇస్లామాబాద్లో ఇలాగే బాంబు పేలుడు జరిగి 12 మంది మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. ఇది బీఎల్ఏ ఆత్మాహుతి దాడి పనే అని అప్పట్లో పాక్ ఆరోపించింది.
కాగా, వారం నుంచి బలూచిస్థాన్లో బీఎల్ఏ దళాలకు పాక్ సైన్యానికి మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరువైపులా ఇప్పటికే 300 మంది దాకా చనిపోయారు. తమ మహిళలు కొందరు ఆత్మాహుతి దాడులు చేసినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా బీఎల్ఏ వీడియోలు విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బీఎల్ఏ.. గత ఏడాది హెరోఫ్1 పేరుతో బలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్లో దాడులు చేసింది. ఇప్పుడు వారం నుంచి హెరోఫ్2 పేరుతో మరోసారి విరుచుకుపడుతోంది.
Read Also: 96 ఏళ్ల వయసులో భరతనాట్యంలో అదరగొట్టిన బామ్మ.. వీడియో వైరల్
Follow Us On: Pinterest


