కలం, వెబ్ డెస్క్: దేశాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన జమ్మూ కశ్మీరులోని పహల్గాం ఉగ్ర దాడికి (Pahalgam Attack) రేపటితో ఏడాది పూర్తి కాబోతుంది. బైసరన్ లోయ అందాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులను మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. 26 మంది మరణించిన ఈ దారుణ కాండను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోగా.. భారతీయుల గుండెలు రగిలాయి. దీనికి జవాబుగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్ లోని ఉగ్ర క్యాంపులను సర్వనాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘోరానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం ఎలా గుర్తించింది.. వారిని ఎలా చంపేసింది.. అనే విషయాలు అత్యంత ఆసక్తికరం.
కశ్మీర్ లోయను బంధించి..
దొరికిన ఆధారాల ప్రకారం పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను సులేమాన్ షా, హమ్జా అఫ్గనీ, జిబ్రాన్ భాయ్ గా నిఘా విభాగం గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఈ ముగ్గురు కశ్మీర్ లోయ దాటి బయటకు పారిపోకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. వీరిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో పాటు హ్యుమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడారు. వీరు దక్షిణ కశ్మీరులోని దట్టమైన అడవుల్లో నుంచి దచిగాం ప్రాంతానికి పారిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రాంతం పూర్తిగా కొండ లోయలు, వెళ్లడానికి కూడా అనువుగా లేనంతగా దట్టమైందిగా ఉంటాయి. అయినా, వారిని పట్టుకునేందుకు సైన్యం భారీ స్థాయి ఆపరేషన్ చేపట్టింది. అందుకు, చాలా సమయమే పట్టింది.
‘ఆపరేషన్ మహదేవ్’ ప్రారంభం..
ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సీఆర్పీఎఫ్, జమ్మూ పోలీసులతో పాటు స్పెషల్ పారా కమెండోలను రంగంలోకి దించింది. ఆపరేషన్ ప్రారంభించిన 3 నెలల తరువాత ఎట్టకేలకు కొండ గుహల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారు. అప్పటికే జవాన్లు సుమారు 290 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కుతూ, వాగులు దాటుతూ.. నడిచి ఉగ్రవాదులను వెతుక్కుంటూ వెళ్లారు. చివరికి, ఓ గుహలో నక్కి ఉన్న వారిని గుర్తించి, లొంగిపోవాలని ఆదేశించారు. వినకపోవడంతో బుల్లెట్ల వర్షం కురిపించి.. అమాయక ప్రజలను హత్య చేసిన ముగ్గురు నరహంతకులను సైనికును కాల్చి చంపేశారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం జవాన్లు ఎంతలా శ్రమిస్తారనేందుకే ఈ ఆపరేషన్ పెద్ద ఉదహరణ అని ఆర్మీ నిపుణులు కొనియాడారు.

