కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత్ కు ఇంధన సరఫరా సరిపడినంతగా జరగడం లేదనే విషయం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ధరలు భారీగా పెరుగుతుండడంతో సామాన్య జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి సంచలన ప్రకటన చేశారు. అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ (Andaman Gas) నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం-3 వద్ద సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. 355 మీటర్ల నీటి లోతులో ఈ సహజ వాయువును కనుగొన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షలలో, నిరంతర ఫ్లేరింగ్ ద్వారా సహజ వాయువు ఉనికిని నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. అండమాన్ సముద్రంలో ఉన్న అపారమైన ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఈ సరికొత్త ఆవిష్కరణ మరోసారి నిరూపించిందని హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ కెలోరిఫిక్ విలువను అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా ప్రస్తుతం గ్యాస్ శాంప్లింగ్ చేపడుతోందని వివరించారు.

