కలం, వెబ్ డెస్క్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలోని దహెగాం (Dahegaon) రామాలయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న సమయంలో, ఒక వానరం (Monkey) ఆలయంలోకి ప్రవేశించింది. హారతి జరుగుతున్న వేళ, అది నేరుగా హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి, తల వంచి భక్తితో మొక్కినట్లు కనిపించింది. ఆ దృశ్యం అక్కడున్న భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
అంతటితో ఆగకుండా, స్వాములు ఇచ్చిన తీర్థాన్ని కూడా ఆ వానరం స్వీకరించి, శాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనను చూసిన భక్తులు “సాక్షాత్తూ హనుమంతుడే వానర రూపంలో దర్శనమిచ్చారు” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచింది.

