కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. నగరానికి చెందిన డోల అనిల్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడకముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తన మృతికి గల కారణాలను అనిల్ వివరించాడు. తన ప్రియురాలితో పాటు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ తనను తీవ్రంగా వేధించారని అతను ఆరోపించాడు. ‘నన్ను పెళ్లి చేసుకో లేదా చావు, లేదంటే మేమే చంపేస్తాం’ అంటూ వారు తనను మానసికంగా వేధించినట్లు అనిల్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఫోన్ ద్వారానే కాకుండా, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించిన సమయంలో కూడా సదరు మహిళా కానిస్టేబుల్ తనను కించపరుస్తూ మాట్లాడిందని, తీవ్రమైన బెదిరింపులకు గురిచేసిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనిల్ తండ్రి వెంటనే నిజామాబాద్ (Nizamabad) మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకు ప్రేమించిన యువతి, మహిళా కానిస్టేబుల్ వేధింపుల వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు. ప్రేమ వ్యవహారంలో గొడవల వల్ల వారిద్దరూ విడిపోయినప్పటికీ, పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బాధితుడి తండ్రి కోరుతున్నారు.
Read Also: గ్లోబల్ ఏరోస్పేస్ హబ్గా తెలంగాణ: రాకెట్ను ప్రారంభించిన సీఎం
Follow Us On : WhatsApp

