కలం, వెబ్డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (Tiruvuru)లో జరిగిన మెప్మా ఎన్నికలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. సొంత పార్టీలోనే వర్గపోరుతో ఈ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తించాయి. ఇక ఫలితాల్లో ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni)కి షాకిస్తూ కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) వర్గం ఘన విజయం సాధించింది. ఎన్నికలకు ముందు స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ వర్గం ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కొలికపూడి ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొలికపూడి శ్రీనివాస్ సపోర్ట్ చేసిన జనసేన కార్యకర్త డెక్కా నవ్యకు 23 మంది సభ్యులు ఓటు వేసి గెలిపించారు. టీడీపీ నాయకుడు అయ్యుండి జనసేనను గెలిపించుకున్నారని ఎంపీ చిన్ని వర్గం కొలికపూడిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కొలికపూడి మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మెప్మాకు 36 మంది సభ్యుల్లో 26 మంది ఇక్కడికి వచ్చి ఓటు వేశారన్నారు. కొందరిని రౌడీ మూకలు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. మెప్మాకు ఎన్నికలు పెట్టాలని అడిగితే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కొంత మందిని ఇంటికి వెళ్లి బెదిరింపులకు గురి చేశారన్నారు. మెప్మా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తే ఎంపీ కేశినేని చిన్నికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పని చేయొద్దని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా కూడా పని చేయకూడదని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మెప్మా ఎన్నికలు జరిగాయని చెప్పారు. తాను కేవలం చంద్రబాబు ఆశయాల సాధన కోసమే నిరంతరం పని చేస్తున్నానని కొలికపూడి (Kolikapudi Srinivasa Rao) స్పష్టం చేశారు. ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరువూరు పేదరిక నిర్మూలణ కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ నాయకత్వంలో పని చేద్దామని పిలుపునిచ్చారు.
Read Also: సోషల్ మీడియా కేసులు.. పులివెందులలో సజ్జల భార్గవ విచారణ
Follow Us On : WhatsApp

