కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా ఒక యువతిని ప్రేమించి, మరో యువతితో నిశ్చితార్థం కావడంతో తలెత్తిన మనస్పర్థల కారణంగా అనిల్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామాబాద్(Nizamabad) నగరానికి చెందిన అనిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల అనిల్కు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అనిల్తో గొడవపడినట్లు సమాచారం. వీరి వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో, మూడవ ఠాణా పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.
ప్రేమించిన యువతికి, నిశ్చితార్థం చేసుకున్న యువతికి మధ్య ఏం చేయాలో పాలుపోక, తీవ్ర ఒత్తిడికి లోనైన అనిల్ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేట్ వద్ద డెమో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

