కలం వెబ్ డెస్క్: ఇటీవల తన పశ్చిమ బెంగాల్ (West Bengal) పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికరమైన ఫోటోలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. కోల్కతాలోని హుగ్లీ నదీ తీరాన గడిపిన సమయం తనకు ఎంతో ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పవిత్ర గంగానది పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ, ఆ దృశ్యాలను స్వయంగా తన కెమెరాలో బంధించినట్లు ఆయన తెలిపారు. ప్రతి బెంగాలీ హృదయంలో గంగానదికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉందని, గంగమ్మ బెంగాల్ ఆత్మలో ప్రవహిస్తుందని మోదీ అన్నారు. ఈ పవిత్ర జలాలు మన ప్రాచీన నాగరికత, శాశ్వత చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని కొనియాడారు. గంగమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకే తనకు ఈ అవకాశం లభించడం అదృష్టమని పేర్కొన్నారు.
ఇక హౌరా వంతెన, బోట్ జర్నీ, విద్యాసాగర్ సేతు ఎంతో గొప్ప అనుభూతినిచ్చాయని మోదీ వెల్లడించారు. స్థానికంగా పడవలు నడిపే కార్మికుల శ్రమను మోదీ ప్రశంసించారు. హుగ్లీ నదీ తీరాన నిలబడి పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, బెంగాలీ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. హుగ్లీ తీరంలో గడిపిన సమయం తన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు.

