కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ పార్టీ (TDP) నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ నెల 27 నుంచి ‘ఇంటింటికీ టీడీపీ'(Intintiki TDP) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గ్రామాల్లోకి ప్రతి ఇంటికీ తిరిగి కూటమి ప్రభుత్వ పనులను ప్రజలకు వివరించనున్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వివరించడంతోపాటు ప్రజల అభిప్రాయాలను తీసుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, యువత ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, రహదారులు, తాగునీటి సదుపాయాలు, గృహ నిర్మాణం వంటి అనేక అంశాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులందరూ చురుకుగా పాల్గొనాలని నాయకత్వం పిలుపునిచ్చింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగించేలా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసింది.

