కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Nizamabad Road Accident) జరిగింది. డిచ్పల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారి సీఎస్ఐ మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైవేపై వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ కారును డికొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న కంటైనర్ వారిద్దరిని మళ్లీ ఢీకొట్టింది.
దీంతో ఆ కంటైనర్ కిందపడి యువకుల శరీర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ఇద్దరు యువకులు హైదరాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

