కలం, వెబ్ డెస్క్: సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వ్యక్తికి ఎబోలా వైరస్ తరహా లక్షణాలు కనిపించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించిన విషయం తెలిసిందే. దీనిపై ఆసుపత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సూడాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తికి థర్మల్ స్క్రీనింగ్ సమయంలో జ్వరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో చేర్చాం. అతడి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్లోని సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం (CCMB)కు పంపించాం. ప్రస్తుతం అనుమానుతుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. జ్వరం కూడా తగ్గింది. పరీక్ష ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం’ అని ఆసుపత్రి అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి మోకాలి శస్త్రచికిత్స కోసం సూడాన్ నుంచి హైదరాబాద్కి వచ్చినట్లు సమాచారం.
అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..
ఆఫ్రికా దేశాల నుంచి వివిధ రాష్ట్రాలకు వస్తున్న వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఓ వ్యక్తికి ఎబోలా తరహా లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైంది. అతడికి రక్త పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్న నేపథ్యంలో, నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దేశంలో ఎక్కడా కూడా ఎబోలా కేసులు నమోదు కాలేదు. ఎయిర్పోర్టులు, నౌకాశ్రయాల్లో వైద్య సిబ్బందితో ప్రత్యేక పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

