కలం, నిజామాబాద్ బ్యూరో : 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను(Godavari Pushkaralu) పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. నిజమాబాద్ కలెక్టరేట్ లో గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో జేసీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది.
పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోఛంపాడ్, సావెల్, తడ్ పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయి. వీటితో పాటు మరికొన్ని అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన పనులను గుర్తించాలని సూచించారు. గత పుష్కరాలలో గోదావరి నది (Godavari River) లో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా వివరాలు సమర్పించాలని సిబ్బందికి జేసీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.


