కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజా అభివృద్ధికి (Public Development) కృషి చేయాలని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana) సూచించారు. ఇందూరు నగరంలోని శ్రీరామ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తూ నిజామాబాద్ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అధికారుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి శాఖాధికారి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని, శాఖల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆబ్కారీ శాఖ బెల్ట్ షాపులను కట్టడి చేయడానికి కృషి చేయాలని సూచించారు. మద్యానికి బానిసలై యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ పరంగా పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. నగరంలో అనేక అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని, వాటిని సొంత భవనాలలోకి మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు కలిగేలా ఉండాలని, నామమాత్రంగా కాకుండా ఫలితాల దిశగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, నూడా చైర్మన్ కేశ వేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

