కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Nizamabad GGH)లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇటీవల ప్రారంభమైన క్యాథ్ ల్యాబ్ సేవలలో భాగంగా తొలి స్టెంట్ విజయవంతంగా వేశారు. బురాజీ (65) అనే వ్యక్తి తీవ్రమైన ఛాతినొప్పితో ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి ఆయనకు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (Acute MI), గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు.
అతని పరిస్థితిని అత్యవసరంగా గుర్తించిన కార్డియాలజీ బృందం వెంటనే థ్రాంబోలైసిస్ చేసి రోగిని స్థిరీకరించింది. అనంతరం యాంజియోగ్రామ్ పరీక్షలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రైట్ కరోనరీ ఆర్టరీ (RCA) లో తీవ్ర బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్డియాలజీ బృందం విజయవంతంగా పీటీసీఏ (PTCA) స్టెంట్ అమరిక చేపట్టింది. జీజీహెచ్ నిజామాబాద్లో మొట్టమొదటి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియను కార్డియాలజీ విభాగ వైద్యులు డా. సందీప్, డా. గోపీకృష్ణ, డా. రవికిరణ్ ల బృందం విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి కోలుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. బి.వి. నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రాములు కార్డియాలజీ బృందాన్ని, క్యాథ్ ల్యాబ్ సిబ్బందిని, నర్సింగ్ సహాయక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వారు ఈ సందర్బంగా మాట్లాడుతూ “జిల్లా ప్రజలకు అత్యాధునిక గుండె వైద్య సేవలను స్థానికంగానే అందించడంలో ఇది ఒక కీలక మైలురాయి అన్నారు. ఇకపై గుండెపోటు రోగులకు అత్యవసర చికిత్సలు, స్టెంట్ ప్రక్రియలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండటం ఎంతో సంతోషకరం” అని తెలిపారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో అత్యవసర గుండె వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్ నిజామాబాద్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు..

