కలం, నిజామాబాద్ బ్యూరో : ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం మూడు నెలల బకాయి వేతనాలు ఇతర సమస్యలను అసెంబ్లీ సమావేశాలలో చర్చకు పెట్టాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్(Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) కు ఆశా వర్కర్లు వినతి పత్రం అందించారు. అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ సానుకూలంగా స్పందించి.. అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్ల సమస్యలు లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
నిజామాబాద్లో సుమారు 1230 మంది ఆశా వర్కర్లు గత 20 ఏళ్ల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని.. వీరిలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులుని చెప్పారు. నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల (ASHA Workers) సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా నేటికి వేతనాలు పెంచలేదు.
50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి, ఎరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావటం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో NHM కు నిధులు పెంచాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.

