కలం, కరీంనగర్ బ్యూరో : హైదరాబాద్ లోని ఘట్ కేసర్ రాక్ కన్వెన్షన్లో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin), జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు కరీంనగర్ (Karimnagar) జిల్లా నాయకులు హాజరయ్యారు.
ఈ సమావేశ విరామం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas), డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డిలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు మర్యాదపూర్వకంగా పరిచయం చేశారు. మరోవైపు బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ను కూడా కరీంనగర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుల సమష్టి కృషిని సునీల్ బన్సల్ అభినందించారు.
ఈ సందర్బంగా నితిన్ నబిన్ (Nitin Nabin) మాట్లాడుతూ… పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ దొంగ హామీలపై పోరాడాలని… డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించకుండా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజలకు మోసపూరిత, దొంగ హామీలు ఇచ్చి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీని గద్దె దించే వరకు పోరాడాలన్నారు.
ఏమరపాటుగా ఉండకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో బీజేపీ గెలుపు కోసం పనిచేస్తూ ప్రజా మద్దతు కూడగట్టాలని సూచించారు. ఇదే సమయంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీ పాలకవర్గానికి మద్దతు తెలిపి, అధికారం కట్టబెట్టిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!
Follow Us On: Instagram

