కలం మెదక్ బ్యూరో: పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతోమంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి (Nirmala Jagga Reddy) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) పట్టణంలోని సంజీవ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష, ALMICO ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలు, వీల్ చైర్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రోత్సాహం అందించి, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా డీఈఓ వెంకటేశ్వర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోశ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీతా మహేశ్, యశోద, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

