కలం, నిజామాబాద్ బ్యూరో: రెడ్క్రాస్(Red Cross)లో సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సంస్థ సమాజ సేవలో విశిష్ట పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్త మార్పిడి సేవలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోందని తెలిపారు.
అన్ని ప్రభుత్వశాఖలు ముందుకురావాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే అన్ని శాఖలు తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించి అవసరమైన రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా సహకరించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డేటా నమోదు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.
సభ్యత్వ నమోదు ఇలా చేసుకోవచ్చు
రెడ్ క్రాస్ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కోసం www.redcross.cgg.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా “Telangana Red Cross” మొబైల్ యాప్ ప్లే స్టోర్, iOS ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉందని, దాని ద్వారా కూడా ఎవరైనా సులభంగా ఆన్లైన్ సభ్యత్వం పొందవచ్చని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స అంజనేయులు మాట్లాడుతూ, జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు కే కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్వో బీ గీత, డీఆర్డీడీవో పీడీ రెడ్ క్రాస్ సభ్యత్వ నోడల్ ఆఫీసర్ సాయన్న, సీఐవో సాయ గౌడ్, డిప్యూటి లేబర్ కమిషనర్ యాదయ్య, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అబ్బాపూర్ రవి, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ డివిజన్ వైస్ చైర్మన్ ఏ మురళీకృష్ణ, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణతో పాటు రెడ్ క్రాస్ మరియు జూనియర్ మండల్ కోఆర్డినేటర్స్ రమేష్ శ్రీనివాస్ వెంకటేష్ సభ్యులు పాల్గొన్నారు.

