కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికి కాపాడుకోవడానికే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు (Ramchander Rao) ఈ ఫీజు రీయింబర్స్మెంట్ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విమర్శించారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురు మామిడి మండలం నవాబ్ పేటలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని రామచందర్ రావుకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టినప్పుడు కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
అడ్వాన్స్ పేమెంట్లు – గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నాం
ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల ద్వారా అడ్వాన్స్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారా? కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపడుతూ, అధికారంలోకి రాగానే మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని పేర్కొన్నారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేయించాలని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుకు అనవసరంగా అడ్డం పడవద్దని హెచ్చరించారు.

