కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం పరిధిలోని మహంకాళి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు (Nirmal Police) వేగంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్జిల్లా దొంగలతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి దొంగిలించిన వెండి కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
గత నెల జూన్ 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ ఆలయ గోడ దూకి లోపలికి ప్రవేశించి గేటు తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగలించినట్లు తెలిపారు. అనంతరం రూ.16 వేల నగదు, వెండి కిరీటంతో బాసర రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్కు చెందిన ఆనంద్ సహకారంతో మహారాష్ట్రలోని నాందేడ్ కు కాచిగూడ – నాగర్సోల్ రైలులో తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు బాసర రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురినీ గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీ, ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్సై ఎస్. దీపక్, నిర్మల్ టౌన్ సీఐ సమ్మయ్యతో పాటు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.

