కలం, వెబ్ డెస్క్: ప్రతి ముగ్గురు గ్రాడ్యుయేట్లలో ఒకరు ఇంజినీర్గా ఉన్న మన దేశంలో అక్కడక్కడా వెలుస్తున్న కొన్ని నిర్మాణాలు ప్రజలను షాక్కు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని మెహదీపట్నం (Mehdipatnam)లో కొత్తగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (Foot Over Bridge) సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ బ్రిడ్జిని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) దాదాపు రూ.38 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జి డిజైన్ చూస్తుంటే, జనం ఒక వైపు నుండి మరోవైపు వెళ్లడానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలేమోనని, లేదా కమాండోల్లా పాకుతూ వెళ్లాల్సి వస్తుందేమోనని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. కారణం ఈ బ్రిడ్జి పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ కింద నుంచే వెళ్తోంది. అలాగే రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉంది. ఇటీవల పలు భారీ వాహనాలు సైతం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జికి తగిలి ప్రమాదాలు జరిగాయి.
ఈ ప్రాజెక్ట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ హయాంలో కీలక పనులు పూర్తి చేసుకొని చివరి దశకు వచ్చింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టులో ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వంతెన నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకున్న ఏ ఒక్క అధికారి గానీ, కాంట్రాక్టర్ గానీ కనీసం ఒక్కసారి కూడా ఈ వంతెనపై నడిచి చూసినట్లు లేరని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రజల సౌకర్యం కంటే కూడా కమీషన్ల కోసమే ఇలాంటి అస్తవ్యస్తమైన నిర్మాణాలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. ఇంత ఖరీదైన, పనికి రాని స్కైవేకి బదులుగా ఒక సాధారణ సబ్వే కట్టి ఉంటే సరిపోయి ఉండేదని కామెంట్ చేస్తున్నారు.
Read Also: బీ అలర్ట్.. మహిళలకు నిద్రతక్కువైతే ఈ హెల్త్ ఇష్యూస్ అటాక్!
Follow Us On: X(Twitter)

