కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో ఓ మహిళపై ఆమె భర్త, అతని తమ్ముళ్లు, స్నేహితులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆందోళనకరమైన నివేదికను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన సదరు మహిళ గౌరవానికి, శారీరక స్వేచ్ఛకు, వివాహ పవిత్రతకు తీవ్ర భంగం కలిగించడమేనని పేర్కొంది. ఈ దుశ్చర్యను కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు, నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేసి బాధితురాలికి తగిన రక్షణ కల్పించేలా చూడాలని తెలంగాణ డీజీపీని ఛైర్పర్సన్ ఆదేశించారు. 7 రోజుల్లోగా వివరణాత్మక కార్యాచరణ నివేదికను ఇవ్వాలని కోరింది.
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే.. తొలి రాత్రి తన తమ్ముళ్లు, స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. నవాజ్ అనే యువకుడు ఒక షాపు అద్దెకు కావాలనే నెపంతో సదరు మహిళను సంప్రదించాడని తెలిపారు. పరిచయం పెంచుకొని, ప్రేమించానని ప్రపోస్ చేసి, తన ప్రేమని అంగీకరించాలని తన వెంటపడ్డట్లు మహిళ ఫిర్యాదు చేసినట్లు వివరించారు. తన అసలు గుర్తింపును దాచి.. నవదుర్గగా పేరు మార్చుకుని 2025 జూన్లో ఆమెను వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించిందని తెలిపారు. తన భర్త గురించి ఆరా తీయగా నవాజ్కు ఇది మూడో పెళ్లి అని తెలియడంతో తమను ఆశ్రయించిందని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్కు పరీక్ష
Follow Us On: Instagram

