కలం, కరీంనగర్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ARRIVE – ALIVE” రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అమలుపై కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. వారం రోజుల పాటు రోజుకో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
13న ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. రెండో రోజు వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 3వ రోజు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్, రోడ్ మార్కింగ్స్ను పునరుద్ధరించాలని సూచించారు. నాల్గవరోజు పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు చిన్నతనం నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణ అలవడేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆటో, బస్సు, లారీ డ్రైవర్లకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి హెల్మెట్ సీట్బెల్ట్ ప్రాముఖ్యతను వివరించమన్నారు.
ఐదో రోజు ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సహాయంపై ప్రజలకు వివరించాలన్నారు. ఆరవరోజు వారంలో ఒక రోజు ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా కేవలం కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. నిబంధనల పట్ల నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందన్నారు. ‘ARRIVE – ALIVE’ లక్ష్యం నెరవేరాలంటే డ్రైవర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి అని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు.
Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్కు పరీక్ష
Follow Us On : WhatsApp

