కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం (Satavahana University) లో ‘అర్బన్ నక్సల్స్'(Urban Naxals) ఉన్నారంటూ ప్రచారం చేయడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ అంశంపై వర్సిటీ వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పీహెచ్డీ అడ్మిషన్ పొందిన కొందరు పరిశోధక విద్యార్థులు ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్తో పాటు కలెక్టర్కు ఫిర్యాదులు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ ఫిర్యాదుల్లో సోషియాలజీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఎకనామిక్స్ పీజీ విద్యార్థి కరికే మహేశ్ పేర్లు ప్రస్తావించబడటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
ఈ ఫిర్యాదులను వీసీ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అర్బన్ నక్సల్స్ పేరుతో దళితులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. మరోవైపు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, ప్రశ్నించే వారిపై ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదానికి మరో కోణం కూడా చేరింది. నాలుగేళ్ల క్రితం 12బీ అంశంపై ఫిర్యాదులు చేసిన కారణంగా తొలగించబడ్డ డాక్టర్ పెంచాల శ్రీనివాస్, డాక్టర్ చక్రధర్లను తిరిగి పార్ట్టైమ్ లెక్చరర్లుగా నియమించడం చర్చనీయాంశమైంది. ఈ నియామకంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై వీసీ ఉమేశ్ కుమార్ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, సూరేపల్లి సుజాత తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ‘వీసీ వర్సెస్ ప్రొఫెసర్’ గా సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను (Minister Adluri) శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) జేఏసీ విద్యార్థులు కలిసి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలను వివరించి, దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానాకు ఫోన్ చేసి విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిజానిజాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also: మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన.. సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్
Follow Us On : WhatsApp

