కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ కరీంనగర్ (Karimnagar AITUC) జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జమ్మికుంట మండలం కోరపల్లిలో కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ హమాలి కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం జమ్మికుంట మండల అధ్యక్షులు వంగ ఓదేలు అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత లేకుండా పని భద్రత కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని, తక్కువ కూలికి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు దించేటప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, కాబట్టి వీరికి ప్రమాద బీమా సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా కార్మిక శాఖ ప్రభుత్వ చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
వెంటనే ప్రభుత్వం హమాలి కార్మికుల సంక్షేమం కోసం పని భద్రతతో పాటు వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాలని కోరారు. దీనిపైన రాష్ట్ర మహాసభలో కోఆపరేటివ్ హమాలి కార్మికుల సమస్యలపై తీర్మానం చేయడం జరుగుతుందని, రానున్న రోజులలొ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈనెల 12వ తేదీన కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా మహాసభలకు కార్యకర్తలు తరలి రావాలని కోరారు.
కరీంనగర్లో సెప్టెంబర్ 6,7, 8 తేదీలలో జరిగే రాష్ట్ర నాలుగో మహాసభల్లో జిల్లాలోని హామాలి కార్మికులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోరపెల్లి యువ చైతన్య తాపీ సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్, అధ్యక్షులు కనకం కుమార్, ఉపాధ్యక్షులు బోయిని సమ్మయ్య, టీ నర్సింగరావు, సలహాదారులు ఇల్లందుల చందు, బోయిని అంకుస్, పోచయ్య లతోపాటు దాదాపు 20 మంది కార్యకర్తలు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బుచ్చన్న యాదవ ఆధ్వర్యంలో ఏఐటీయుసీలో చేరారు.
ఈ సమావేశంలో కోపరేటివ్ హమాలి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మచనపల్లి శ్రీనివాస్, యుగేందర్, గిరవేణి రాజు, తిక్క శ్రీధర్, గేల రాములు కె. తిరుపతి, బండారి స్వామి, బీర్ల నరేష్, పి. రాజయ్య, పి. ఈరన్న, ఎల్ సుమన్, పిల్లి రాజు, పి. ఐలయ్య, కిరణ్, బి. రాజు కార్మికులు పాల్గొన్నారు.

