కలం, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో మరికొన్ని నిమిషాల్లో ఓటింగ్ జరగబోతుండగా ప్రధాని మోడీ (Narendra Modi) అన్ని పార్టీల ఎంపీలకు అప్పీల్ చేశారు. ఎమోషనల్ టచ్తో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అప్పీల్ చేయడం గమనార్హం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఓటింగ్ జరగనున్నది. రాజ్యంగ సవరణతో ముడిపడిన బిల్లులు కావడంతో మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరిగా మారింది. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అంతటి సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్షాల మద్దతు అనివార్యమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్కు రెండు గంటల ముందు ప్రధాని మోడీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆయన మెసేజ్ సారాంశం ఇది..
“నేను పార్లమెంటు సభ్యులందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా.. మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)పై ఓటింగ్ సందర్భంగా మీ ఇంట్లోని తల్లి, సోదరి, కుమార్తె, భార్యను స్మరించుకోండి.. మీ అంతరాత్మ ప్రభోదాన్ని వినండి.. మన దేశ ‘నారీ శక్తి’ని గౌరవించడానికి, సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం.. వారిని ఈ కొత్త అవకాశాల నుండి దూరం చేయకండి.. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందితే దేశంలోని నారీశక్తి మరింత బలోపేతం అవుతుంది.. మన దేశ ప్రజాస్వామ్యం మరింత దృఢంగా మారుతుంది.. కలిసి రండి.. ఈ రోజు మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం.. దేశంలోని సగం జనాభాకు వారి హక్కును అందిద్దాం..” అని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ బిల్లుతో ముడిపడి ఉన్న మహిళా బిల్లుపై మోడీ (Narendra Modi) తనదైన శైలిలో అప్పీల్ చేశారు.

