కలం, మహబూబ్నగర్ బ్యూరో: రైతుల ఆదాయం పెంపొందించుకునేందుకు సేంద్రియ వ్యవసాయం చేయాలని నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) సూచించారు. సోమవారం పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం వార్షిక ప్రణాళికపై జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించడం ద్వారా రైతుల ఆదాయాలు పెంచవచ్చన్నారు. గ్రామీణ జీవోనోపాధికి మద్దతు ఇస్తూ స్థిరమైన వ్యవసాయాన్ని తీసుకురావడమే పథకం ఉదేశ్యం అన్నారు.
నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఆ పథకం అమలుకు సంబంధితశాఖల అధికారులు తమతమ శాఖలకు సంబంధించిన వార్షిక ప్రణాళికను అమలు చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. వార్షిక ప్రణాళిక అమలులో ఇన్నోవేటివ్ ఉండాలన్నారు. అంతకుముందు ఆ పథకం నోడల్ అధికారి సాయిబాబా మాట్లాడుతూ.. దేశంలోని 100 జిల్లాల్లో నారాయణపేట జిల్లా ఈ పథకం కింద ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభపరిణామన్నారు.
రాష్ట్రంలో ఈ పథకం కింద ఎంపికైన నాలుగు జిల్లాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మూడు జిల్లాలు నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట ఉన్నాయని వివరించారు. గత జనవరి 3, 4న జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కో ఆపరేషన్ పీఎండీడీకేవై సెంట్రల్ నోడల్ అధికారి రమణ్ కుమార్ నారాయణపేట జిల్లాలో పర్యటించి పథకం అమలు తీరును పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్డీడీవో వెంకట్ రాములు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియ నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్, డీపీవో సుధాకర్రెడ్డి, ఎల్డీ ఎం విజయ్ కుమార్, నాబార్డు అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఎబోలా వైరస్ వ్యాప్తి.. ముందస్తు చర్యలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష
Follow Us On: Sharechat

