కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా శక్తి ఇందిరమ్మ క్యాంటీన్ (Indiramma Canteen)ను శనివారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ (Hemanta Keshav Patil) ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్యాంటీన్ పనితీరును ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. సందర్శన సందర్భంగా క్యాంటీన్లో వంటకాలు తయారు చేసే విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార పదార్థాల నాణ్యతను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి, ప్రతిరోజూ భోజనం సమయానికి అందుతున్నదా, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని, వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని కూడా ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కలెక్టరేట్కు వివిధ పనుల కోసం వచ్చే ప్రజలతో మాట్లాడి, భోజనం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఆహారం రుచికరంగా, నాణ్యతతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఆహారంలో పరిశుభ్రత అత్యంత ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతలో రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. క్యాంటీన్ నిర్వహణలో పారదర్శకత పాటించడంతో పాటు, వంటగది నుండి పంపిణీ వరకు ప్రతి దశలో శుభ్రతను కచ్చితంగా అమలు చేయాలని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

