కలం మెదక్ బ్యూరో: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ (Medak) జిల్లా శివంపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం నేలపై పడుకుని వినూత్నంగా నిరసన తెలిపింది. 2020వ సంవత్సరంలో శివంపేట మండలం భీక్య తండాకు చెందిన రైతు తేజవత్ భద్రియా మృతిచెందాడు. భద్రియాకు ఐదు మంది సంతానం. భద్రియా పేరుపై సర్వే నెంబర్ 315/37/2లో ఉన్న 2 ఎకరాల 38 గుంటల భూమి ఉండేది. అయితే ఈ భూమిని అక్రమంగా శివం పేట మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిక్రిష్ణ అన్న అయిన హనుమంతరావు పట్టా చేయించుకున్నారని భద్రియా కుమారులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి చెందిన భూమిని హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి హనుమంతరావు అమ్మేసి సొమ్ము చేసుకున్నారని భద్రియా కుమారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తమ నాన్న పేరుపై ఉన్న పట్టా భూమిని అప్పటి అధికారులు మాముళ్ల మత్తులో తమకు తెలియకుండా, తమ ప్రమేయం లేకుండా దొంగతనంగా మరొకరి పేరు మీదికి మార్చారని వారు ఆరోపిస్తున్నారు. తన నుండి తమకు రావాల్సిన భూమిని అక్రమంగా రిజిస్టేషన్ చేసుకున్నారని, ఏళ్లుగా తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదంటూ శనివారం కుటుంబాలతో కలిసి శివంపేట ఎమ్మార్వో అఫీసులో ఆందోళనకు దిగారు. తమ కుటుంబ భూమి కోసం మాజీ ఎంపీపీ హరికృష్ణను ఎన్నిసార్లు కలిసి మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమే తమకు బ్రతుకుదెరువు అని, అధికారులు తమ సమస్యను పరిష్కరించేంత వరకు కార్యాలయంలోనే పడుకుంటామని ఆందోళన చేశారు. తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

