కలం, వెబ్డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నాలుగో సీజన్కు అదిరే ఆరంభం. శుక్రవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (RCB Vs MI) లో ఆర్సీబీ గెలుపు బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండర్ నదిన్ డిక్లెర్క్(63 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు; 4/26) తన జట్టుకు విజయం సాధించి పెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా చివరి నాలుగు బంతులను సిక్స్, ఫోర్, సిక్స్, ఫోర్గా మలచి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
ఈ మ్యాచ్ (RCB Vs MI) లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సజీవన్ సజన (45; 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. నికోలా కేరీ(40; 29 బంతుల్లో 4 ఫోర్లు), కమలిని(32;28 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్(20; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్ నదిన్ డిక్లెర్క్ 4 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్ చెరో వికెట్ తీశారు. ఛేదనలో ఆర్సీబీ తడబడింది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మంధాన (18) నిరాశ పర్చింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరి పోరాటం చేసిన నదిన్ డిక్లెర్క్(Nadine De Klerk ) ఆఖరి ఓవర్లో 18 పరుగులు అవసరంగా కాగా, రెండు సిక్స్లు, రెండు ఫోర్లు కొట్టి తన జట్టుకు 3 వికెట్ల తేడాతో(157/7) విజయాన్ని అందించింది. ఆల్రౌండ్ షో కనబర్చిన నదిన్ డిక్లెర్క్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.


