కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల వేళ భారత్కు ఎల్పీజీ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. గ్యాస్ బుక్ చేస్తే.. అది ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గ్యాస్ వినియోగదారులు జాగ్రత్త పడుతున్నారు. సిలిండర్ పూర్తి కాకముందే రీఫిల్ కోసం బుకింగ్లను మొదలుపెట్టారు. ఏపీలోనూ ఇదే తరహా విధానం అమలవుతుండటంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల (Nadendla Manohar) మనోహర్ కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్లపై ప్రజలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చించినట్లు పేర్కొన్నారు. గెయిల్ నుంచి పైప్లైన్ ద్వారా సరఫరాపై చర్చించామన్నారు. గ్యాస్ సరఫరాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రోజుకు 3 లక్షలపైగా గ్యాస్ డెలివరీలు చేస్తున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రజలు ఆందోళన చెంది ఎక్కువ బుకింగ్స్ చేయొద్దని.. రీఫిల్ బుకింగ్ కోసం సమయం ఇవ్వాలని సూచించారు.
చంద్రబాబు సమీక్ష
అంతకుముందు ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. ఈ సమావేశానికి గ్యాస్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు . ఏపీలో అందుబాటులో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ ఉన్నట్లు సీఎంకు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు . 1,154 ఏజేన్సీల నుంచి గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కాగా, సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని గ్యాస్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బ్లాక్మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆసుపత్రులు, స్కూల్లు, దేవాలయాల్లో.. ఎలాంటి ఇబ్బందులు తలఎత్తకుండా చూడాలన్నారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్ లైన్ తో పాటు.. ఇండక్షన్ స్టవ్ లను అందుబాటులోకి తేవాలని సూచించారు.

