కలం, వెబ్ డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లా పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసఫ్ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో యూసఫ్ తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కేవలం శ్రీరాముడి కృప వల్లనే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డానని అంటున్నాడు. రాముడి పట్ల తన భక్తిని చాటుకునేందుకు హనుమాన్ దీక్ష చేపట్టాడు. కులమతాలకు అతీతంగా 11 రోజులపాటు నియమనిష్టలతో ఈ దీక్షను కొనసాగించి అందరినీ ఆశ్చర్యపర్చాడు.
హనుమాన్ జయంతిని (Hanuman Jayanti) పురస్కరించుకుని యూసఫ్ కాలినడకన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నాడు. అక్కడ స్వామివారిని దర్శించుకుని హిందూ సంప్రదాయం ప్రకారం మాలను విరమించాడు. మతం ఏదైనా దైవం ఒక్కటేనని, ఆపదలో తనను కాపాడిన దేవుడిపై భక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాడు. యూసఫ్ను స్థానికులతోపాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. సలాం భాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

