కలం, నల్లగొండ బ్యూరో: రాబోయే రోజుల్లో మునుగోడు (Munugode) నియోజకవర్గం ఎడారిగా మారడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (MLA Kusukuntla Prabhakar Reddy) తెలిపారు. చండూరులో ఆయన ఆదివారం చర్లగూడెం ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు చుక్కనీరు అందే పరిస్థితి కనబడటం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1200 కోట్లతో చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 0.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చుక్క నీరు రావడం లేదని ఆరోపించారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, తాగు, సాగు నీటి సమస్యను ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఆయనకు కావాల్సింది అభివృద్ధి కాదు.. కాంట్రాక్టులు, కమీషన్లంటూ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి మునుగోడు ప్రజలపై లేదని నిలదీశారు. ఇప్పటికైనా చర్లగూడెం రిజర్వాయర్కు జరుగుతున్న అన్యాయంపై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు. మునుగోడు ప్రజల గొంతు తడపాలని కోరుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

