కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో (Nizamabad Central Jail) జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ములాఖత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ను డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉదయ కృష్ణ, సబ్ జైలర్ మన్మధ రావు శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్బంగా ఉదయ కృష్ణ మాట్లాడుతూ.. ఖైదీలను కలవడానికి వచ్చే వారికి హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుందని తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీలు, శిక్ష పడిన ఖైదీల బంధుమిత్రులు ములాఖత్కు వచ్చేటప్పుడు ఇబ్బందులు లేకుండా వీలు కల్పిస్తామని తెలిపారు.
దరఖాస్తులు నింపి సాయం..
ములాకత్కు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులు ఉంటారని, ఈ హెల్ప్ డెస్క్లో వారికి స్వయంగా దరఖాస్తులు నింపి సాయం అందిస్తామన్నారు. ఈ డెస్క్లో ఇద్దరు న్యాయసేవ సంస్థ ప్యానల్ న్యాయవాదులు, జైలర్, మరో ముగ్గురు పారా లీగల్ వాలంటీర్స్ సభ్యులుగా ఉంటారని వివరించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మహమ్మద్ షాదుల్ల, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శుభం, ప్యానల్ న్యాయవాదులు లక్ష్మి నారాయణ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

