కలం, వెబ్డెస్క్: శంషాబాద్ (Shamshabad) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించడంపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ (Eatala Rajendar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు ఇలా పలు రకాల కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసి రోడ్డున పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేగం కన్నా ప్రాణం మిన్న లాంటివి నినాదాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు.
ముఖ్యంగా రోడ్డు పక్కన వాహనాలు నిలుపడంపై ఎంపీ మండిపడ్డారు. నిర్లక్ష్యంతో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పక్కన వాహనాలు నిలపరాదని వాహనదారులకు సూచించారు. నిర్లక్ష్యంగా ఎవరైనా వాహనాలు నిలిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. వాహనదారులందరూ భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు.

