కలం, భువనగిరి: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి ఇక్కత్ (Pochampally Ikat) చేనేత వస్త్ర ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో భారీ వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ వేదికగా ఈ నెల 5వ తేదీన శుక్రవారం ఈ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభం కానుంది. చేనేత కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు 100 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరల నుంచి మొదలుకొని రకరకాల కాటన్ దుస్తులు, బెడ్షీట్లు, ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్ర ఉత్పత్తులను ఈ స్టాళ్లలో నేరుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు.

