కలం, భువనగిరి బ్యూరో: ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడడమే తమ ప్రధాన బాధ్యతని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తెలిపారు. శనివారం ఆలేరు (Aleru) నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి పార్లమెంట్ స్థాయిలో పూర్తి సహకారం అందిస్తానని, కేంద్ర నిధుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రణాళికల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలోని మండలాల వారీగా పెండింగ్ పనులు, రాబోయే అభివృద్ధి ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీరు, విద్యా సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్ర శోభ, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు , కౌన్సిలర్లు , సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

