కలం, నల్లగొండ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని, మరి బీఆర్ఎస్ నేతలు ఏ ప్రాతిపదికన సంబరాలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నట్లు ఎంపీ గుర్తుచేశారు. ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ కూడా ఇదే అంశాన్ని ధృవీకరించిందని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వం ఇప్పటివరకు కోరలేదు. కానీ, ప్రాజెక్టు వైఫల్యాలపై వాస్తవాలు నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది అని ఎంపీ చామల చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో బీజేపీ తన ద్వంద్వ వైఖరిని వీడాలని చామల సూచించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది తప్పా? ఒప్పా? అనేది మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి క్లీన్ చిట్ వచ్చిందని వారు భావిస్తున్నారా? ఒకవేళ అవకతవకలు జరిగాయని నమ్మితే కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీపై బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పూర్తి పాఠం అందిన తర్వాత, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ వెల్లడించారు.
పీసీ ఘోష్ కమిషన్ (PC Ghose Commission) రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బుధవారం సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కేసులో క్లీన్ చిట్ కోసం హరీష్ రావు ఢిల్లీలో ఏమైనా మంతనాలు జరిపారా అని చామల ప్రశ్నించారు. ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పలు సంస్థలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని, ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి నిజాలను బయటపెట్టాలని ఆయన కోరారు.
Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…
Follow Us On : WhatsApp

