కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) భాగంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్గా ఉన్నప్పుడు జులై 2023లో నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు తెలిపారు. అప్పటి పీసీసీ చీఫ్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. సిట్ అధికారులకు లభించిన డిస్క్లో ఈటల రాజేందర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డితో సన్నిహితంగా పనిచేస్తున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలు లభించాయి. పోలీస్ అధికారులు నాలుగు గోడల మధ్య చెబుతున్న మాటలు వింటుంటే.. ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం పోయే పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు, విద్యాసంస్థల అధినేతలు, సినిమా నటులు.. ఇలా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేయడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు.
హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్..
కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. దీనికి భయపడి తన సొంత డ్రైవర్, పీఏను ఉద్యోగంలో నుంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత బిడ్డ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినవారికి, తమ ఫోన్లను ట్యాప్ చేయడం లెక్కనే కాదు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ను మించిన వారు లేరు. రెండో సారి అధికారంలోకి వచ్చాక, 88 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించారు’ అని విమర్శించారు.

