కలం, వెబ్ డెస్క్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy) శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ, మంత్రి పదవి, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానన్న కాంగ్రెస్ అధిష్ఠానం హామీని రాహుల్ గాంధీ దగ్గర రాజగోపాల్ రెడ్డి గుర్తు చేసినట్లు సమాచారం అందుతోంది.
కాగా, తెలంగాణ కేబినెట్లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై కూడా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాహుల్ గాంధీ రాజగోపాల్ కు మంత్రి పదవిపై భరోసా ఇచ్చారా? ఆయనకు మంత్రి పదవి దక్కినట్లేనా? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది.

