కలం, వెబ్ డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లాలోని కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో వరి కొయ్యలు కాల్చిన ఓ రైతుకు గ్రామ కార్యదర్శి రూ.5,000 జరిమానా విధించారు. రైతులు పంట పొలంలో వరికొయ్యలు కాల్చొద్దంటూ చాలా రోజులుగా అధికారులు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధులు సైతం వరికొయ్యలు కాల్చొద్దంటూ సూచిస్తున్నారు. పంట కోత అనంతరం మిగిలిన కొయ్యలను కాల్చడంతో వాయు కాలుష్యం చెబుతున్నారు.
ఈ ఘటనపై స్థానికంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య అవసరమేనని చెబుతుండగా.. మరికొందరు చిన్న రైతులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. డంపింగ్ యార్డులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో వరి కొయ్యలు కాల్చే సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా శాస్త్రీయ పద్ధతులు, యంత్రాల వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఇలాంటి వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి చిన్న రైతుపై తీసుకున్న ఈ చర్య పర్యావరణ నియంత్రణలో సమానత్వం ఉండాలా అనే చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.

