కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్తో తనకు ఎలాంటి విబేధాలు లేవని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind) స్పష్టం చేశారు. ఇటీవల బండి భగీరథ్ కేసులో బాధితురాలి కుటుంబం వెనుక తానే ఉండి నడిపిస్తున్నాననే వార్తలను కొట్టిపారేశారు. తనకు బాధితురాలి కుటుంబం ఎవరో తెలియదని.. భగీరథ్ను తానెప్పుడూ కలవలేదన్నారు. అయినా ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తనకు కూడా అర్థం కావడం లేదన్నారు. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే.. ఆ స్థానంలోకి తాను వెళ్లాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. తనకు ఇప్పుడున్న ఎంపీ పదవితో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
పసుపు బోర్డుకు స్థలం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం..
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కావాలనేదే 1987 నుంచి పోరాడుతున్నారని.. తీరా తాను పట్టుబట్టి సాధిస్తే, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఎంపీ అర్వింద్ వాపోయారు. పార్టీలో అప్పుడప్పుడు అభిప్రాయ బేధాలు సహజమేనన్నారు. మునుగోడు, నాగార్జున సాగర్ ఎన్నికల సమయాల్లో తాను పార్టీతో విబేధించాను తప్ప వ్యతిరేకించలేదన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గాలి పాలన చేస్తున్నారని విమర్శించారు.

