కలం, ఖమ్మం బ్యూరో: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు ఖమ్మం న్యాయస్థానం శనివారం కఠిన శిక్ష, భారీ జరిమానాలు విధించింది. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన నిందితులను నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బీ నాగలక్ష్మి ఎదుట హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయమూర్తి కీలక తీర్పు చెప్పారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ దొరికిన వారిలో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధించగా, మరో 11 మందికి తలా 10,100 రూపాయల చొప్పున, ఇంకొకరికి 20,100 రూపాయల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు శిక్ష పడిన వ్యక్తిని వెంటనే ఖమ్మం జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ వెల్లడించారు. కాగా, ఈ కేసులలో చురుగ్గా వ్యవహరించిన ట్రాఫిక్ కోర్ట్ కానిస్టేబుల్ సతీష్ను ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలకే కాకుండా, రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

