కలం, వెబ్డెస్క్: అచ్చం మనీహీస్ట్ (Money heist) సినిమాను తలపించే ఓ భారీ దోపిడీ (Bank Robbery) జర్మనీ (Germany) లో జరిగింది. గోడలకు డ్రిల్స్ చేసి, వాల్ట్లు బద్దలుకొట్టి ఒకటీ రెండూ కాదు ఏకంగా 35 మిలియన్ డాలర్లు (రూ.315కోట్లు) నగదును దొంగలు దోచుకెళ్లారు. క్యాష్తోపాటు నగలు, వజ్రాలు, బంగారం, వెండి కూడా పట్టుకెళ్లారు. వీటి విలువ లెక్కించాల్సి ఉంది. జర్మనీలోని జెల్సెన్కిష్షెన్ నగరంలో ఉన్న ఓ బ్యాంకులో ఈ దోపిడీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున బ్యాంకులో ఫైర్ అలారం మోగడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని దోపిడీ విషయం గుర్తించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడే వేడి, ధూళి కారణంగా అలారం మోగుతుందని ముందే అంచనా వేసిన దుండగులు, దాన్ని అడ్డుకునేందుకు నీటిని పిచికారి చేసినట్లు గుర్తించారు. బ్యాంకుకు సమీపంలోని పార్కింగ్ స్థలానికి చెందిన దిగువ అంతస్థులో ఓ సొరంగం(టన్నెల్) ఉంది. దాని ద్వారా బ్యాంకు బేస్మెంట్కు చేరుకున్న దుండగులు, అక్కడి నుంచి గోడలను డ్రిల్చేశారు. నగదు బాక్స్లు, లాకర్లు ఉంచే గదికి చేరుకొని, వాటిని తెరిచి సొమ్ముతో పరారయ్యారు.
దోపిడీ (Bank Robbery) జరిగిన తీరు చూస్తే ఆరితేరిన దొంగలు పక్కా ప్రణాళికతో, టెక్నాలజీని వాడుకొని చేసినట్లు ఉందని పోలీసులు అంటున్నారు. డ్రిల్ కోసం వాడిన పరికరాలు సాధారణ హార్డ్వేర్ దుకాణాల్లో దొరకవని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, జర్మనీలో క్రిస్మస్కు 24,25,26 తేదీలల్లో సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత 27, 28 వీకెండ్ కావడంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు మూసి ఉన్నాయి. ఈ అవకాశాన్ని దుండగులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


