కలం, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్తో (CSK) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చిత్తయింది. 104 పరుగుల భారీ తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ ఓటమిపై మాజీ భారత పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma) తీవ్రంగా విమర్శించారు. ఈ మ్యాచ్లో ముంబై ప్రదర్శన అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముంబై ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై గతంలో గెలిచిన మ్యాచ్ను గుర్తు చేస్తూ, అప్పుడు కూడా కేవలం తిలక్ వర్మ ఒక్కడే అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని మోహిత్ చెప్పారు. కానీ, తాజా మ్యాచ్లో మాత్రం జట్టు మొత్తం చేతులెత్తేసిందని అన్నారు. బ్యాటింగ్లో ఎవరూ రాణించకపోవడంతో ఇది ముమ్మాటికీ పూర్తి స్థాయి వైఫల్యమేనని ఆయన విశ్లేషించారు.
జట్టు మళ్ళీ పుంజుకోవాలంటే సీనియర్ ఆటగాళ్లు ముందుకు రావాలని మోహిత్ (Mohit Sharma) సూచించారు. సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయడం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తన వ్యక్తిగత ప్రదర్శనను కూడా మెరుగుపరుచుకోవాలని అన్నారు. సీనియర్ల మీద అదనపు బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ సీజన్లో ముంబై స్టార్ బ్యాటర్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 7 మ్యాచ్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేశారు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 97 పరుగులకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ముంబైకి ఇది పెద్ద ఎదురుదెబ్బ.
Read Also: ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు
Follow Us On: Sharechat

